మహబూబాబాద్ : కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటున్నానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మీ వెంటే ఉంటున్నానని, మీరంతా కలిసికట్టుగా పని చేయాలని, తన గెలుపు కోసం ఈ నెల రోజులు పాటు పడితే, వచ్చే 5 ఏళ్ళు తను కార్యకర్తల అభివృద్ధి కోసం పని చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిన వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో మంత్రి గ్రామాల వారీగా ఆదివారం ఆత్మీయ సమీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ్రామాలను అభివృద్ధి చేసింది మనమే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవ్వాళ గ్రామాలు అన్ని మౌలిక సదుపాయాలు సంతరించుకున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. ప్రజల వద్దకు పరిపాలనను తీసుక వచ్చాం. తొర్రూరును డివిజన్ కేంద్రం చేశాం. మున్సిపాలిటీని చేశాం. రూ.150 కోట్లతో తొర్రూరును అభివృద్ధి పరిచామని అని మంత్రి తెలిపారు. ప్రజల కష్ట, సుఖాలలో పాలు పంచుకున్నం.
ఇప్పటిదాకా గ్రామాల అభివృద్ధి పై దృష్టి సారించానన్నారు. ఇక కార్యకర్తల బాగోగులు చూస్తామని హామీ ఇచ్చారు. మన మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెడదాం. కలిసికట్టుగా పని చేద్దాం అని మంత్రి ఉద్బోధించారు. గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధిని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, మన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి అని కార్యకర్తలకు సూచించారు.