వరంగల్ : దివ్యాంగుల సంక్షేమానికి ఎర్రబెల్లి ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయపర్తి ఎంపిడిఓ కార్యాలయంలో దివ్యాంగుల వారోత్సవాలు-ప్రతిభావంతుల పురస్కార ఉత్సవం కార్యక్రమాన్ని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి, పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఈ రోజు నా చేత కేక్ కట్ చేయించి, ప్రతిభావంతులైన దివ్యాంగులకు సత్కారం చేయించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సంఘం దివ్యాంగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. ఈమధ్యే ఎర్రబెల్లి ట్రస్ట్ నుంచి 5 మోటర్ ట్రై సైకిల్స్ అందజేశాం.
రాయపర్తి మండలంలో ఒక్కో గ్రామం నుంచి అర్హులైన కనీసం ఒక్కరికైనా ట్రై మోటర్ సైకిల్ అందజేస్తామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ ఏదో ఒక సహాయం తప్పకుండా అందుతుందని మంత్రి భరోసానిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.