జనగాం: పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెల్లో శాశ్వతంగా అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జనగాం (Janagama) జిల్లా దేవరుప్పుల మండలం చిన్న మడూరులో, దేవరుప్పుల గ్రామాల్లో మంగళ వారం జరిగిన బీఅర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్(KCR) సందేశాన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రావడంతోపాటు, 3,146 గూడాలు, తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలు అయ్యాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) గారి దూరదృష్టితో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు అందాయని వెల్లడించారు. పల్లె ప్రగతి(Palle pragathi) ద్వారా పారిశుధ్యం, వైకుంఠాధామాలు, సీసీరోడ్లు(CC Roads), నర్సరీల ఏర్పాటు పెద్ద ఎత్తున జరిగిందని తెలిపారు.
రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్ వల్ల తెలంగాణ సస్యశ్యామలమైందని వివరించారు. ప్రతి గ్రామంలో కోటి రూపాయలతో అభివృద్ధి జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మేళనంలో ఎర్రబెల్లి ట్రస్టు చైర్పర్సన్ ఉషా దయాకర్ రావు , ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.