చండూరు : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీపీఐ, సీపీఎం నాయకులతో భేటీ అయ్యారు. బుధవారం చండూరులో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో కొనసాగుతున్న ప్రచార బృందం ఎదురుపడింది. దీంతో ఇరువురు కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. మునుగోడు ఎన్నికల్లో జరుగుతున్న ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉందని వారితో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని వారికి సూచించారు. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ధి చెప్పేలా ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు. ఈ సందర్భంగా చండూరుకు చెందిన సీనియర్ నాయకులు జోగి సంతోశ్, గుంటి మల్లేశ్ టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పీఎంపీ, ఆర్ఎంపీలు సహకరించాలి..
చండూరు లో పీఎంపీ,ఆర్ఎంపీలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆయా సంఘాలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అండగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సమస్యలు పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. మునుగోడులో ఎన్నికలు రావడానికి గల కారణాలను వివరించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించే విధంగా సహకరించాలని మంత్రి కోరారు.