వరంగల్ : ఆట ఆటలతో కూడినదే అసలైన చదువని, విద్యా వినోదంతో కూడిందే మంచి విద్య అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విద్యావ్యవస్థని సీఎం కేసీఆర్ గొప్పగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి చెప్పారు.
రాయపర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారిణి లతో కలిసి వాలీబాల్, బతుకమ్మ ఆడి సందడి చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..పాఠశాల స్థాయిలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. రంగం ఏదైనా ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఉద్బోధించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే, విద్యారంగం బాగా అభివృద్ధి చెందుతున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా కేజీ నుంచి పీజీ దాకా విద్యను అందిస్తున్నదని మంత్రి చెప్పారు. క్రీడాడాకారులకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు, వారికోసం ప్రత్యేకంగా క్రీడా స్కూల్స్, అకాడెమీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అంతకుముందు మంత్రి అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, సోషల్ వెల్ఫేర్ ఆర్సీవో సూరినేని విద్యా రాణి పాల్గొన్నారు.