హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో తెలంగాణ మరోసారి సత్తాచాటడం పట్ల రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నెలవారీ నివేదికల్లో మరోసారి టాప్( Top) లో తెలంగాణ ఉండటం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) మానసపుత్రికలైన పల్లె, పట్టణ ప్రగతి పథకం అమలు ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయని అన్నారు.
ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో స్థానం సంపాందించిన జిల్లాల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాల ప్రయాణాన్ని ఈ విధంగానే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారి, స్వచ్ఛ తెలంగాణను చేశాయన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగింటిలో రెండు కేటగిరీలలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అచీవర్స్ లో రెండు, హై అచీవర్స్ లో రెండు స్థానాలు, మొత్తం 4 స్థానాలు తెలంగాణకు దక్కడం విశేషం. హై అచీవర్స్ కేటగిరీలో జనగామ, కామారెడ్డి జిల్లాలు, అచీవర్స్ లో కేటగిరీలో హనుమకొండ, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నత స్థాయిలో నిలిచాయి. నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు ఈ సారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కాయి. ఈ మేరకు జూన్ -2023 నివేదిక ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.