వరంగల్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో విజయ గర్జన సభ నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వరంగల్ నగర సమీపంలో సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా నగరంలోని మడికొండ శివారులోని ఖాళీ స్థలాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి పరిశీలించారు. టీఆర్ఎస్ విజయ గర్జన సభను 10 లక్షల మందితో భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి ఎలాంటి అటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.