వరంగల్ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. సకల సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు.
నీటి వసతి, టాయిలెట్స్, తరగతి గదులు, మధ్యాహ్నం అందిస్తున్న జావా, చదువు, స్కూల్ ఆవరణలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నిర్మితమవుతున్న అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని పేర్కొన్నారు.
సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు. సీఎం చొరవతో ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు మంచి విద్య అందించడమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణకు రాగి జావా అందిస్తున్నామని చెప్పారు. అనంతరం రాగి జావా నాన్యాతను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి విద్యార్థులకు పంపిణి చేశారు.