హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలు ఆయన పదవికి తగ్గట్టుగా లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీజేపీ అంటేనే అబద్ధాలని, అద్వానీ, జోషి లాంటి వాళ్లను తొక్కి పైకి వచ్చిన మోదీ తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్ల ఆయనకు సెంటిమెంట్లు తెలియవని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ది కుటుంబ పాలన కాదని, ఆయన కుటుంబమంతా తెలంగాణ కోసం ఉద్యమించి.. జైళ్లకు పోయి త్యాగాలు చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని అవమానించడమంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ నీచంగా, దిగ జారి మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో కించపరిచారని, తెలంగాణ ప్రజలను నూకలు తినాలని అవమానపరిచారని మండిపడ్డారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా వివక్ష చూపిస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. మోదీ ఇవాళ వచ్చి తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఎవరూ నమ్మరన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో మోదీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అంబానీ, అదానీలు మోదీ కుటుంబ సభ్యులని, వారిద్దరితోపాటు, బీజేపీని తరిమికొడితేనే దేశానికి విముక్తి అని అన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని ఆకాంక్షించారు. తాము తెలంగాణ కోసం ఇప్పటిదాకా పోరాటం చేశామని, ఇకనుంచి దేశంకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.