గతంలో కుంభకోణాలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ను లాభాల్లోకి తెచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. డీసీసీబీ సేవలను వివిధ రంగాలకు విస్తారించామన్నారు. తాజాగా, విద్యార్థుల చదువు కోసం కూడా రుణాలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో పలువురికి గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యా రుణాలకు సంబంధించిన మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గతంలో కొందరు డీసీసీబీని ఏలారని, కుంభకోణాలకు పాల్పడి ఆ బ్యాంకును దివాలా తీయించే స్థాయికి తీసుకువచ్చారని ఆరోపించారు. తర్వాతి కాలంలో డీసీసీబీ చైర్మన్గా మానేరు రవీందర్రావు, వెంకటేశ్వర్ రెడ్డి వచ్చాక డీసీసీబీ నష్టాల నుంచి బయటపడిందన్నారు. లాభాల బాట పట్టిందని మంత్రి వివరించారు. ఇప్పుడు రైతులు, పారిశ్రామికవేత్తలతోపాటు ఉపాధి రంగాలకు విరివిగా రుణాలు ఇస్తూ వారందరి అభివృద్ధికి డీసీసీబీ పాటుపడుతున్నదని మంత్రి తెలిపారు. మన తెలంగాణలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ప్రజల బాగు కోసం పథకాలను రూపొందించి, అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.