వరంగల్ : ఖానాపురం మండలం దబీర్పేట గ్రామంలో దామెర రాకేశ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషీయా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. అంతకుముందు రాకేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో రాకేశ్ మృతి చెందడం బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాలేదు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో అతని కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు. రాకేశ్ సోదరుడు రామ్రాజ్కు రెవెన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించిన రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేశామన్నారు.
దబీర్పేట గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇక నుంచి ఈ గ్రామాభివృద్ధి తనదే అని ప్రకటించారు. దబీర్పేటలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నానని పేర్కొన్నారు. కేవ్లా తండాకు రూ. 20 లక్షలు మంజూరు చేస్తామన్నారు. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల వంటి ఏ పథకాలు వచ్చినా దబీర్పేటకు అధిక ప్రాధాన్యం ఇస్తామని దయాకర్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గోపి, ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్, రాకేశ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.