అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వారు అందరి బిడ్డలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వాళ్లకి మేమున్నామని భరోసా కల్పించడం సమాజం బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం త్వరలోనే అనాధ పిల్లల కోసం ఒక సమగ్ర పకడ్బంది చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు కేంద్రంలోని సెయింట్ పాల్స్ స్కూల్ లో అనాథ పిల్లలతో మంత్రి కాసేపు గడిపారు. వారితో ముచ్చటించారు. సాదక బాధకాలు తెలుసుకున్నారు. ఇప్పటికే అనాధల చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చిందని, సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత అది ఒక సమగ్ర చట్టం రూపు దిద్దుకుంటుందని ఎర్రబెల్లి ప్రకటించారు.