వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నేడు మంత్రి దయాకర రావు కార్యాలయంలో 18మందికి మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ బీ ఫామ్లు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్లే.. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులకు ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా టికెట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, సీనియర్లను కూడా కలుపుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. టికెట్ రాని వారికి భవిష్యత్లో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కేసీఆర్ సీఎం అయ్యాక వరంగల్ నగరం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. వరంగల్ అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని కోపోద్రిక్తులయ్యారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, నాయకుల మధ్య తగాదాలు పెట్టేందుకు చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. వరంగల్ నగరానికి రూ. 1600 కోట్లతో ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలని మంత్రి దయాకర్ రావు అన్నారు.