హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థపై సోమవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. హైదరాబాద్, వరంగల్లోని కార్యాలయాల్లో ఏకకాలంలో 40 బృందాలు సోదాలు నిర్వహించాయి. సంస్థకు సంబంధించిన ఆడిట్ను పరిశీలించాయి. సంస్థకు నిధులు ఎక్కడికెక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్రంలో బాలవికాసకు మంచి పేరు ఉంది. ఎన్నో ఏండ్లుగా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందిస్తున్నది. దీంతో పాటు గ్రామీణ విద్యార్థుల చదువులకు సాయం చేయడం, మహిళలకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. మూడు దశాబ్దాలుగా దేశ, విదేశాల నుంచి నిధులు సేకరించి, ప్రజా సేవ చేస్తున్న బాల వికాస సంస్థపై ఐటీ దాడులు బాధాకరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అయినందునే కేంద్రం ఐటీ దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు.
మిషనరీలే లక్ష్యంగా కేంద్రం కక్ష
క్రైస్తవ మిషనరీలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. బాల వికాస సంస్థపై దాడులను ఖండించారు. క్రైస్తవ మిషనరీ సంస్థలు దేశంలో సేవా కార్యక్రమాలు చేయకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. లౌకిక దేశంలో కేంద్రం కావాలని ఇతర మతాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.