దేవరుప్పుల, నవంబర్ 14: పేద విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి చదువుతో పాటు ఉచిత వసతులు కల్పిస్తున్నదని, ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకాంక్షించారు. సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలికలతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడారు. చదువుపై దృష్టి పెట్టి లక్ష్యం ఎంచుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భోజనంతో పాటు వసతులు బాగున్నాయని విద్యార్థినులు తెలిపారు. జడ్పీటీసీ పల్లా భార్గవి రూ.లక్ష విలువైన వంట సామగ్రిని కస్తూర్బా పాఠశాలకు మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా అందించారు.
అనంతరం జాతీయ రహదారిపై దేశ భక్తులు, మహనీయుల వేషధారణతో బాలయేసు విద్యార్థులు ప్రదర్శన ఇస్తుండగా మంత్రి వారిని చూసి కాసేపు ఆగి, వారికి చాక్లెట్లు పంచిపెట్టారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు చదువులో రాణించి దేశ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని సూచించారు.