హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) భౌతికకాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం (93).. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్కు తరలించారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం తూటాలా పేలే తన మాటను పాటగా మార్చి ప్రజలను, మహిళలను చైతన్య పరిచారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును ఎదిరించారని చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భీం రెడ్డి నరసింహా రెడ్డి వంటి ఉద్దండులతో కలిసి మల్లు స్వరాజ్యం పనిచేశారని తెలిపారు. పాలకుర్తి ప్రాంతంతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఆమె జీవిత మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శమని వెల్లడించారు.
కాగా, మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మరికాసేపట్లో నల్లగొండకు తరలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పిస్తారు. అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం 3.30 గంటలకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.