హైదరాబాద్ : వరంగల్ హెల్త్ సిటీలో భాగంగా సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇచ్చిన హామీ మేరకు హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వరంగల్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్రావుకు బాధ్యతలు అప్పగించినందున పనులు మరింత వేగవంతంగా పూర్తి కాగలని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి అయితే, హైదరాబాద్ స్థాయి వైద్యం, ఇక్కడే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్పై భారం తగ్గుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. దీంతో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వమని రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.