పాలకుర్తి : మహా శివరాత్రి ఏర్పాట్లపై పాలకుర్తిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఉత్సవాలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా స్నానఘట్టాలు, దర్శనాలు, స్వామి అమ్మవార్ల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా అంశాల వారీగా చర్చించారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. మేడారం జాతర తరహాలో సెక్టోరియల్ అధికారులను నియమించాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్శాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. దేవాదాయశాఖ మరింత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గతంలో కంటే ఈసారి పాలకుర్తిని ఎక్కువ మంది భక్తులు సందర్శించే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో పాలకుర్తి, బమ్మెర, వల్మీడిలను కలుపుకుని అధ్యాత్మిక కారిడార్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి దేవాలయం, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.