హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు కొంతకాలంగా ఆలస్యమవుతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది? కారణం ఎవరు? అనే విషయాన్ని పక్కనబెట్టి, ఓ జాతీయ దిన పత్రిక ప్రచురించిన కథనాన్ని కోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం అజ్ఞానం ప్రదర్శిస్తూ ట్వీట్ చేశారు. ఆలస్యానికి కారణాలేమిటో తెలుసుకొనే పరిజ్ఞానం ఆ పత్రికకు లేకపోయినా, రాష్ట్ర అధ్యక్షుడిగా కనీసం బండి సంజయ్ పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడుతారని భావిస్తాం. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగానే డబ్బులు ఆలస్యంగా విడుదలవుతూ, ఇంకాస్త ఆలస్యంగా కూలీలకు చేరుతున్నాయి. ఇవన్నీ వదిలేసి బండి మరోసారి జ్ఞానం ప్రదర్శించి అభాసుపాలయ్యారు.
ఆలస్యానికి కారణం ఇదీ..
ఉపాధి హామీ కూలీల హాజరు, చెల్లింపుపై ఉమ్మడి రాష్ట్రంలో అమలైన సాఫ్ట్వేర్నే స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉపయోగిస్తూ ఉన్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాఫ్ట్వేర్ను తయారుచేసి అందులోకి మారాలంటూ రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి అందులోకి మారింది. అప్పటి నుంచి కొత్త సమస్యలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలను ఏర్పాటుచేసింది.
పంచాయతీల సంఖ్య 12,769కి పెరిగింది. తండాలు, గూడేలు, ఆవాసాలు కూడా పంచాయతీలుగా మారాయి. అప్పటికే ఉన్న గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన పంచాయతీ పరిధిలోని కూలీలకు కొత్త సమస్య వచ్చిపడింది. కేంద్రం రూపొందించిన సాఫ్ట్వేర్లో ఒకే అకౌంట్తో రెండు జాబు కార్డులు పాత, కొత్త రెండు పంచాయతీల్లో కనిపిస్తున్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త పంచాయతీల్లోని ఉపాధి కూలీలకు మళ్లీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు ఖాతా తెరిచి వివరాలు అప్లోడ్ చేయాలని, ఆ తర్వాతే కూలి మొత్తాన్ని జమచేస్తామంటూ కేంద్రం మెలిక పెట్టింది.
కొత్త పంచాయతీల్లో లక్షల మంది కూలీలు కొత్తగా బ్యాంకు, పోస్ట్ ఆఫీసు ఖాతాలు తెరవాల్సి వస్తున్నది. ఈ తంతు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. దీనికి సమయం పడుతుండటంతో కూలి డబ్బులు జమవడానికి ఆలస్యమవుతున్నది. కేంద్రం మెలిక కారణంగా జరిగే ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేద్దామనే అజ్ఞానంతో బండి సంజయ్ బొక్కబోర్లా పడ్డారు. కేంద్రం కొత్త సాఫ్ట్వేర్ తీసుకొని రాకముందు దేశంలోనే ఉపాధి చెల్లింపుల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ఈ ఘనతను కేంద్ర అధికారులు అనేక మార్లు ప్రశంసించారు.
చెల్లింపుల విధానం ఇలా..
ఇబ్బందుల్లో 1.25 లక్షల మంది కూలీలు: ఎర్రబెల్లి
రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న రూ.110 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం లేఖ రాశారు. రెండు నెలలుగా కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం నిధులు విడుదల కాకపోవడంతో 1.25 లక్షల మంది కూలీలు అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత సెప్టెంబర్ 28 నుంచి కేంద్రం జమ చేయకపోవడంతో కూలీల ఆవేదన దృష్ట్యా ప్రభుత్వం తరఫున మంత్రి లేఖరాశారు.