కరీంనగర్: పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని చెప్పారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. పల్లెప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్లో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్లా దేశంలో ఎవ్వరూ రైతుల అభివృద్ధికి పాటుపడటం లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని, గ్రామాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే బండి సంజయ్ భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి అమిత్షా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని విమర్శించారు.
విషం చిమ్ముతున్న కేంద్రం: మంత్రి గంగుల
రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం విషం చిమ్ముతున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ముందు ఇక్కడ అన్ని ఇబ్బందులు ఉండేవని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. సాగునీరు, పంటల పెట్టుబడి, బీమా, కల్తీలేని విత్తనాలు, ఇంటింటికీ నల్లా నీళ్లు, కోతలు లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతి సాధించిన ప్రగతి ఎంతో ఉందని, ఈ కార్యక్రమంతో ప్రతి పల్లెలో పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. గ్రామాల్లో గతంలో, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు.