ప్రజలకు సేవచేసే మంచి గుణమున్న బీసీ నాయకుడు ఒద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ కు పంపుతున్నదుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్లు ఒద్ధిరాజు రవిచంద్ర సోమవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఒద్దిరాజు రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, తెలంగాణ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు అమలుచేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని అడిగారు. ఎన్నికల కోసం కొంతమంది బ్రోకర్గాళ్లు మాట్లాడితే ఎవరూ నమ్మరన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో జయశంకర్ సార్ను కలిశాడా? అని ప్రశ్నించారు. జేఏసీ మీటింగ్ కు ఎప్పుడైనా వచ్చాడా? అని అడిగారు. అలాంటి మూర్ఖుడు ఇప్పుడు జయశంకర్సార్ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జయశంకర్సార్ తన గురువని, ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేసింది తామేనన్నారు. కావాలంటే రేవంత్రెడ్డి తనతో కలిసి జయశంకర్సార్ గ్రామానికి రావొచ్చన్నారు.
కులమతాలకతీతంగా అవకాశాలు: పల్లా రాజేశ్వర్రెడ్డి
కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులకు సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ను వేలం పెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలకు, మతాలకు అక్రమంగా పుట్టిన నేత అని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల మధ్య అతడు చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వెదవలు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరమన్నారు.
ప్రజలకు సేవ చేసినవారే గెలుస్తారని, కులాలు, మతాలతో గెలిచిన చరిత్ర ఎవరికీ లేదని పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్లో కులాలు, మతాల పంచాయితీ లేదన్నారు. రైతు ఆత్మహత్యలపై రేవంత్రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. రచ్చబండలోనే రేవంత్రెడ్డిని రచ్చరచ్చ చేస్తామని హెచ్చరించారు. రైతులను మోసం చేసింది మోదీ అని, ఆయన క్షమాపణలు చెప్పినప్పుడే ప్రజలు తెలుసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడితే బీజేపీ భయపడుతోందన్నారు.
తనకు ఇంత పెద్ద గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని ఒద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సూచనలు రాజ్యసభలో తు.చ. తప్పకుండా పాటిస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం వచ్చేందుకు సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.