తొర్రూరు(మహబూబాబాద్) : తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar) అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) దార్శనికత, పట్టుదలతో ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ను మూడోసారి ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామం, హరిపిరాల గ్రామ శివారుల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.అంతకుముందు చెర్లపాలెంలో 20 లక్షల తో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) ఆవిష్కరించారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయని వెల్లడించారు. రాష్ట్రంలో కాళేశ్వరం(Kaleshwaram) లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు పుష్కలంగా లభించి పంటలు బాగా పండుతుండడంతో రైతులు రాజుగా మారుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటైతే కరెంటు ఉండదని, దీపాలు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన పార్టీల నోరు మూయించేలా 24 గంటలు ఉచిత కరెంటు(Free Power) ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రైతుబంధు( Raitu Bandu), రైతు బీమా(Raitu Beema) రైతులను ఎంతగానో ఆదుకుంటుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతుండగా కేంద్రంలోని మోదీ(Narendra Modi) సర్కారు తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దేశ వ్యాప్త మార్పు కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వివరించారు.
దేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆకలి చావులు ఉన్నాయని, మోదీ ప్రధాని అయ్యాక ఇవి మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.