పాలకుర్తి : పాలకుర్తి – బమ్మెర – వల్మిడి కారిడార్ పనుల ప్రగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
అనంతరం పాలకుర్తి, వల్మీడిలో జరుగుతున్న ఆయా అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు. పాలకుర్తిలో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణాన్ని, వల్మీడి గుట్ట మీద పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లకు తగు సూచనలు చేశారు.
పనులను నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని అదేశించారు. ఆయా పనుల ప్రస్తుత ప్రగతిపై సీఎం కేసీఆర్కు పూర్తి సమాచారం అందే విధంగా నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సోమేశ్వర స్మారక స్థూపం, కళ్యాణ మండపం, గుట్టపైన గిరి ప్రదక్షిణ, ఆలయ ఆధునీకరణ పనులపై మంత్రి సమీక్షించారు. సోమనాథ స్మారక భవనం, కళ్యాణ మండపం, విద్యుదీకరణ, నీటి వసతి ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి తగు సూచనలు చేశారు. అలాగే బమ్మెరలో నిర్మాణంలో ఉన్న పలు పనులను కూడా పరిశీలించారు.
అక్షరాభ్యాస మందిరం, కళ్యాణ మండపం, వల్మిడిలో దేవాలయ ప్రధాన ఆలయం, వడుడికరణ, పాకశాల, రోడ్డు పనులను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాగా, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం- బమ్మెర పోతన స్మారక మందిరం – వల్మీడి శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పాలకుర్తికి రూ.10 కోట్లు, బమ్మెరకు రూ.7.50 కోట్లు, వల్మీడీకి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.