తొర్రూరు, మార్చి 22: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
పంట నష్టంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తమతో మాట్లాడుతున్నారని తెలిపారు. అధికారులు సర్వే చేస్తున్నారని, నివేదికలు రాగానే పంట నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. వడగండ్ల వానతో రైతుకు ఊహించని నష్టాన్ని తెచ్చిపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో పంట చేతికి రావాల్సి ఉన్నదని, ఈ క్రమంలో వడగండ్లు కురవడం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారని భరోసా ఇచ్చారు.