Minister Dayakar Rao | బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా కలుసుకొని వారితో మాట్లాడి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు ఇంకా జరగాల్సిన పురోగతిపై చర్చించి, సమస్యలను పరిష్కరించడానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల నుంచే కాక ప్రజల నుంచి సైతం మంచి స్పందన వస్తుందని ఆయన వివరించారు.
పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో మండల కేంద్రంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన పలు ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు చెప్పారు. త్వరలో పాలకుర్తి మండలంలో నిర్వహించనున్న టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు చేయాల్సిన ఏర్పాట్లపై, నిర్వహించాల్సిన గ్రామాలపై, అలాగే సమ్మేళనాలు నిర్వహించే పద్ధతిపై మంత్రి ఎర్రబెల్లి పార్టీ ముఖ్య నాయకులకు వివరించారు.
పెద్ద గ్రామాలైతే ఒకటి రెండు గ్రామాలకు మించకుండా సమావేశాలు నిర్వహించాలని ఒకవేళ చిన్న గ్రామాలు ఉంటే మూడు నుంచి నాలుగు గ్రామాల వరకు ఎంపిక చేసుకుని ఏదో ఒక గ్రామంలో ఈ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ బాధ్యులు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అలాగే పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నాయకులు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆసక్తిగా వచ్చే ప్రజలను అనుమతించాలని, ఆ రోజు భోజనాలు వడ్డించి అందరినీ ఆత్మీయంగా పలకరించాలని మంత్రి సూచించారు.