తొర్రూరు, ఆగస్టు 29: జాతిపిత మహాత్మాగాంధీ పేరును ఉచ్చరించేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి రుచించడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. స్వాతంత్య్రం సాధించేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టిన సమరయోధుల చరిత్రను కించపర్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండాను సోమవారం మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చి దళిత, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. అందులో భాగంగానే రైల్వే, బీఎస్ఎన్ఎల్తోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని దుయ్యబట్టారు. దళితులు, అంబేద్కర్ వాదులు, రైతాంగం కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎకడాలేని విధంగా సీఎం కేసీఆర్ భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించారని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ఎక్కడ దేశభక్తి ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుందని, ఆ ప్రాంత సమగ్ర వికాసం, అభివృద్ధికి కారణమై అసమానతలు లేని సమాజం నిర్మాణమవుతుందని చెప్పారు. రెండేండ్ల స్వాతంత్రోద్యమ జైలు జీవితంలో అనేక మంది జాతీయ నాయకులను కలిసి ఎంతో నేర్చుకున్నానని, అనేక ఉద్యమాలకు ఆ జైలు జీవితం ఆదర్శమైందని, నేటి తరం విద్యార్థుల్లో స్పూర్తిని నింపేలా ప్రసంగించారు.