హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని, ఇది ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయమన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం కొరిపల్లె గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం వాడవాడలా పర్యటించి పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అలాగే 204 సంఘాలకు రూ.5.20కోట్లకు బ్యాంకు లింకేజీ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన గ్రామసభలో మంత్రి ఎర్రబెల్లి అంశాల వారీగా గ్రామ పరిస్థితులను సమీక్షించారు. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్తను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతితోనే గ్రామాలు బాగుపడుతున్నాయని, 5వ విడుత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు. పారిశుధ్యంతో పల్లెలు ఆరోగ్యవంతంగా మారాయని, పచ్చదనంతో వెల్లివిరుస్తున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు అందుతున్నాయని, సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. గతంలో పల్లెలు ఎలా ఉన్నాయో? ఇప్పుడెలా ఉన్నాయో సరిపోల్చుకోవాలన్నారు.