పాలకుర్తి : కంటికి వెలుగు.. ఇంటికి దీపం సీఎం కేసీఆర్ అని.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాలతో పాటు కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ సగటు పౌరుడికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి మనిషి మరణానంతరం వరకు అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కంటి వెలుగుతో ప్రజల దృష్టి లోపాలను సరి చేస్తున్నట్లు తెలిపారు. ఊరూరా శిబిరాలు నిర్వహించి ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అద్దాలు అందిస్తున్నామని, అలాగే ఆపరేషన్లు సైతం చేయిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. అలాగే ప్రజల హెల్త్ ప్రొఫైల్ను రెడీ చేస్తున్నామని, ప్రయోగాత్మకంగా పెలైట్ ప్రాజెక్టుగా ములుగులో చేపట్టి విజయవంతం చేశామన్నారు. అనంతరం రాష్ట్రంలోని పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను కంప్యూటీకరించి.. అత్యవసర పరిస్థితుల్లో నిమిషాల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో రూ.5.10కోట్లతో 3వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రాయపర్తి, పెరికేడు, తొర్రూరు, నాంచారి మడూరు తదితర గ్రామాల్లో కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు. మహిళలు, శిక్షణ ఇస్తున్న శిక్షకులు, నిర్వహిస్తున్న అధికారులతో మంత్రి మాట్లాడారు.
శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో మాట్లాడి శిక్షణ తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. కుట్టు శిక్షణ అనంతరం ఉపాధి, ఉద్యోగావకాశాలపై కూడా మంత్రి మహిళలకు భరోసానిచ్చారు. శిక్షణ పూర్తయిన తర్వాత తర్వాత వరంగల్లోని టెక్స్టైల్ పార్క్లో అవకాశాలు చాలా ఉన్నాయని, ఇంటి వద్ద నుంచి పని చేసుకునే ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా.. పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.