హైదరాబాద్ : పుస్తకాలతోనే జ్ఞానం పెరుగుతుందని, యువత గ్రంథాలయాలను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. జనగామ జిల్లా కేంద్రంలో గ్రంథాలయంలో జ్యోతిప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుస్తకాలు చదివే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి, అహింస మార్గంలో రాష్ట్రాన్ని సాధించారన్నారు. పుస్తకాలతో చదివితే జ్ఞానం పెరుగుతుందని, యువత గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలన్నారు.
ప్రతి మండల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, జిల్లా కేంద్రంలో కొత్తగా గ్రంథాలయం కట్టేందుకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా గ్రంథాలయాలను కాపాడుకుందామని, ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారన్నారు. కరోనాతో రెండేళ్లుగా ఉత్సవాలు నిర్వహించలేదని, వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రంథాలయాలు విజ్ఞాన భండాగారాలని, వాటిని దేవాలయాలకంటే పవిత్రంగా చూస్తారన్నారు. సీఎం కేసీఆర్కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. కంప్యూటర్ యుగంలో పుస్తక పఠనంతో యువత మొగ్గు చూపుతున్నారని, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైనా నెట్లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతుందని, పుస్తక పఠనంలో ఉన్న తృప్తి సెర్చింగ్లో దొరకదన్నారు. సాంకేతిక ఎంత పెరిగినా.. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా గ్రంథాలయ ప్రత్యేకత కాదనలేనిదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.