Minister Dayakar Rao | నేతన్నలకు ఉపాధి కల్పించి, గౌరవంగా బతికేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పద్మశాలి కల్యాణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం సాధించి.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు గౌరవం దక్కిందన్నారు. సమూక్య రాష్ట్రంలో పాలకులు కులవృత్తులకు ఏమైనా న్యాయం చేశారా? అని ప్రశ్నించారు.
అలాగే పద్మశాలి కుటుంబాల ఉపాధి కోసం బతుకమ్మ చీరలను నేసే బాధ్యత కల్పించారన్నారు. మన ప్రాంతంలో వలస జీవులుగా మారుతున్న నేతన్నలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్న ఘనత బీఆర్ఎస్దేనన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, కొడకండ్లలో వచ్చే నెల అక్టోబర్ 6న మినీ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. పద్మశాలీ బిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు చేసిన ఉద్యమాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.
అలాగే పద్మశాలి ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే భాగ్యం తనకు లభించిందన్నారు. ఆయన సలహాలు, సూచనలు ఉద్యమంలో చాలా ఉపయోగపడ్డాయని, తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలి.. చివరి వరకు పోరాటం చేశారన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం బాపూజీ జల దృశ్యం నుంచే మొదలైందని చెప్పారు. పద్మశాలి నేతలు నల్ల నరసింహులు, కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికి ఆదర్శమని మంత్రి అన్నారు. త్వరలో నల్ల నరసింహులు, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను పాలకుర్తిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పద్మశాలీలు చాలా గౌరవంగా బతికే వారని, ప్రాణం పోయినా కూడా ఇచ్చిన మాట మీద నిలబడు నిలబడతారని, వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కూడా తనదేనని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పద్మశాలీ నేతన్నలకు పెన్షన్ అందిస్తున్నామని, ఇప్పుడు నిర్మిస్తున్న కల్యాణ మండపానికి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ప్రస్తుతం 20లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అభివృద్ధిని ప్రజల ముంగిట్లోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పద్మశాలి సంఘం నేతలు, మండల పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.