హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో పశుమిత్ర, డ్వాక్రా మహిళలకు పశువులకు ప్రాథమిక చికిత్సపై శిక్షణ ఇవ్వగా.. ముగింపు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా హాజరయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ గొర్లు, మేకలు తదితర సంపద గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఆదాయ వనరులన్నారు. రాష్ట్రంలో పశు సంపదకు కొదవ లేదని, భూమి లేని నిరుపేదలు ఈ పశు సందపపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు.
అయితే, పేద రైతులు ఆశించిన స్థాయిలో ఫలితాలు, లాభాలను పశు పోషణ ద్వారా పొందలేకపోతున్నారన్నారు. ఇందుకు సరైన అవగాహన, మెలకువళు పాటించకపోవడమే కారణమన్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది.. గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణపై ఆధారపడే వారి జీవనోపాధిని పెంచుతామన్నారు. సెర్ప్, డ్వాక్రా మహిళలకు పశు సంపదను వారి జీవనోపాధిగా అందిస్తున్నారు. ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పెరటి కోళ్ల పెంపకం వంటి వాటిని అందిస్తుందని, కోట్లాది రూపాయల రుణ సౌకర్యం కల్పిస్తుందన్నారు.
అయితే, పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు వెంటనే, మందులు ఇంజక్షన్లు ఇచ్చే సరైన శిక్షకులు గ్రామాల్లో సరైన శిక్షకులు లేరని, పశు సంవర్థక శాఖ నుంచి గోపాలమిత్ర లాంటి శిక్షకులు ఉన్నా, సరైన సంఖ్యలో లేకపోవడంతో మహిళలు పశుపోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల మహిళలకు పశుమిత్రల పేరుతో, వారికి పశు సంపద ప్రాథమిక చికిత్సపై శిక్షణ అందిస్తుందన్నారు. పశు సంపదలో నట్టల మందులు, రోగాల నివారణ, టీకాలు, దానా, పశు పోషణ, వాటి పునరుత్పత్తి వంటి అంశాల్లో 6 రోజుల పాటు శిక్షణ ఇచ్చిందన్నారు. 24 గంటల పాటు పాడి రైతులకు అందుబాటులో ఉండి, చికిత్స రకరకాల సేవలు పశుమిత్రలు అందిస్తారన్నారు.
పదో తరగతి చదివిన 2,359 మంది డ్వాక్రా సంఘాల మహిళలకు పశుమిత్ర శిక్షణ అందించామన్నారు. ఇది పూర్తిగా స్వయం ఉపాధి కార్యక్రమన్నారు. ఈ ఏడాది కనీస పశువైద్య సేవలు అందుబాటులో లేని గ్రామాల నుంచి 1250 ఎంపిక చేసి.. ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ తర్వాత ప్రతి బ్యాచ్కు 60 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తారన్నారు. ప్రభుత్వం పశుమిత్రలకు గౌరవ వేతనం ఇస్తుందని తెలిపారు. గొర్రెలు, మేకలు, పశువులకు ప్రాథమిక చికిత్స చేయడం ద్వారా నేరుగా రైతుల నుంచి సర్వీస్ చార్జీలు తీసుకోవచ్చని, అలాగే పశు మిత్రలు పశువులు, గొర్రెల వ్యాధులు, వాటి నివారణ, పశు పోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవగాహన కల్పిస్తారని వివరించారు.