Sridhar Babu | ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురి నుంచి మంత్రి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
దరఖాస్తుదారులు విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ను రాయాలన్నారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. ఈ నెల 17న జరిగే టీఎస్ జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరారు. అదేరోజున పలు పరీక్షలు ఉన్నట్లు తెలిపారు.
సంబంధిత అధికారులతో చర్చించి పరీక్షల వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరారు. కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేయగా.. ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, ఎక్సైజ్శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రి పాల్గొన్నారు.