హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Rosaiah) మృతిపట్ల రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. గత కొతకాలంగా అనారోగ్యంతో బాధపడున్న రోశయ్య.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తమ అనుభవాలను మంత్రులు గుర్తుచేసుకున్నారు. రోశయ్య అంటేనే ఆర్థిక శాఖ గుర్తుకు వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతలా ఆ పదవికి వన్నెతెచ్చారని చెప్పారు. సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రోశయ్య మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామన్నారు.
మంచి మాటకారి అయిన రోశయ్య.. తనదైన నుడికారం, వ్యంగమైన వ్యాఖ్యలతో అందరి మన్ననలు పొందారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సుదీర్ఘంగా వ్యక్తిగత, రాజకీయ, సంపూర్ణ జీవితాన్ని అనుభవించారని, వారు లేని లోటు తీర్చలేనిదన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక పదవులు అలంకరించారని చెప్పారు.
మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక పదవులు అలంకరించిన రోశయ్య.. వాటిని సమర్థవంతంగా నిర్వహించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తనదైన శైలితో, చమత్కారాలతో, భాష, సబ్జెక్టుపై పట్టుతో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని, అందరి మన్ననలు పొందారని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాని చెప్పారు.
మాజీ సీఎం రోశయ్య మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం వ్యక్తంచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బహుముఖ ప్రజ్ఞశాలియైన గొప్ప నాయకున్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోల్పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోశయ్య మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు.