హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కోల్ పెన్షనర్లకు మరోసారి కేంద్రం రిక్తహస్తం చూపింది. కనీస పింఛన్ పెంపు విషయంలో పెన్షన్దారుల ఆశలపై నీళ్లు చల్లింది. బొగ్గు గని రిటైర్డ్ కార్మికుల కనీస పింఛన్ను ఇటీవల కేవలం రూ. వెయ్యికి పెంచింది. ఈ మేరకు ది కోల్మైన్స్ పెన్షన్ స్కీమ్-1998కి సవరణలు చేస్తూ, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు అన్ని క్యాటగిరీల కార్మికుల కనీస పింఛన్ రూ.250 – రూ.350గా ఉంది. దీనిని రూ.20 వేలకు పెంచాలన్న డిమాండ్తో రిటైర్డ్ కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించి, పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశాయి. ఈ క్రమంలో కనీస పింఛన్ రూ.వెయ్యికి పెంచుతూ, గత మార్చి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
పెన్షనర్ల అసంతృప్తి..
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రిటైర్డ్ కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం రూ.వెయ్యి పింఛన్తో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది రిటైర్డ్ కోల్ కార్మికులుండగా, సింగరేణి వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా ఉన్నారు. ఇందులో రూ. 250-రూ.350 వరకు పింఛన్ పొందుతున్న వారు 10 వేల మంది ఉన్నారు. కనీస పింఛన్ను రూ.20 వేలకు పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ కోల్ కార్మికులకు అన్ లిమిటెడ్ వైద్యసౌకర్యం కల్పించాలని, 50 శాతం కరువుభత్యం చెల్లించాలని ఆయన కోరారు.