పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవి గెలుపు పట్ల మిన్నంటిన సంబురాలు
బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి, కేక్లు కట్ చేసి ఆనందోత్సహాలు
ఖమ్మం రూరల్లో భారీ గులాబీ జెండాతో ఎంపీపీ విజయోత్సవ ర్యాలీ
టీఆర్ఎస్.. తిరుగులేని శక్తిగా అవతరించిందంటూ శ్రేణుల ఉత్సాహం
నమస్తే తెలంగాణ నెట్వర్క్:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి, ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించడంతో సంబురాలు మిన్నంటాయి. తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ అవతరించిందంటూ శ్రేణులు ఉత్సాహం ప్రదర్శించాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో పటాకుల కాల్చి సంబురాలు జరిపారు. కేకులు కట్ చేసి మిఠాయిలు పంచారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీపీ బెల్లం ఉమ భారీ గులాబీ జెండాను ఊపుతూ విజయ సంకేతం ప్రదర్శించారు. ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో పటాకులు పేల్చారు ‘జై తెలంగాణ, జైజై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు.
పట్టభద్రులకు ధన్యవాదాలు..
‘టీఆర్ఎస్కు విజయాన్నందించిన పట్టభద్రులకు ధన్యవాదాలు. పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు ప్రస్థానం ఇల్లెందు నుంచే ప్రారంభమైంది. సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమించే పల్లా రాజేశ్వర్రెడ్డికి పట్టభద్రులు మరోసారి పట్టం కట్టారు. ఇల్లెందు నియోజకవర్గంలో అత్యధికంగా పట్టభద్రులు 50 శాతం పల్లావైపే మొగ్గు చూపారు.’
-ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్
విజయాభినందనం..
‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించడం, పల్లా రాజేశ్వర్రెడ్డి విజయానికి చేరువలో ఉండడం అభినందనీయం. వాణీదేవి గెలుపు కోసం గౌతమీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్లో ప్రచారం చేశాం.’
-రామావఝల రవికుమార్, బ్రాహ్మణ పరిషత్ నాయకుడు