హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అద్భుతంగా పనిచేస్తున్నదని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆ శాఖ అనేక అంశాల్లో అద్వితీయ ఫలితాలు సాధించి, ప్రశంసలు అందుకుంటున్నదని, ఇంత అద్భుతంగా ఫలితాలు సాధిస్తున్న సీఎం కేసీఆర్కు, ఆ శాఖ మంత్రి హరీశ్రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కొనసాగాలని ఆకాంక్షించారు. శనివారం అసెంబ్లీలో వైద్యారోగ్యశాఖ పద్దుపై జరిగిన చర్చలో పాల్గొన్న అక్బరుద్దీన్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు, నిత్యం తన శాఖ ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ 24/7 అందుబాటులో ఉంటూ మంత్రి హరీశ్రావు వైద్య ఆరోగ్యరంగంలో దేశంలోనే రాష్ర్టాన్ని మూడోస్థానంలో నిలిపారని కొనియాడారు. జీహెచ్ఎంసీ ఆరోగ్యాన్ని బస్తీ దవాఖానలు పరిరక్షిస్తున్నాయని, బస్తీదవాఖానలు వండర్ఫుల్గా వర్ చేస్తున్నాయని కీర్తించారు. పట్టణ ప్రాంతాల్లో లభించే వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయని కొనియాడారు. కేంద్ర ఆరోగ్య కుంటుంబ సంక్షేమ సర్వే ద్వారా వచ్చిన ఈ ఇండికేటర్స్ వృద్ధి చూస్తే, దేశ ఆరోగ్యరంగంతో పోల్చితే తెలంగాణ అనేక రెట్లు బాగుందని అక్బరుద్దీన్ సర్కార్ను కీర్తించారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ దేశానికి రోల్మాడల్గా నిలిచిందని పేర్కొన్నారు.