హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మళ్లింపుపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూ రు చేయాలని కోరుతూ పలువురు మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం సరఫరా చేసిన ధాన్యాన్ని దారిమళ్లించడం ద్వారా ప్రభుత్వానికి రూ.3,960 కోట్ల నష్టం కలిగించారంటూ దాదాపు 360 రైస్ మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దీంతో వారిని అరెస్టు చేసే అవకాశాలున్నందున ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే సుజన సోమవారం విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు. వా టిని విచారించాలన్న అభ్యర్థనకు న్యాయమూర్తి అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.