Work From Car | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): పనిచేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనాతో వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది. దానికి అలవాటుపడిన ఉద్యోగులు, తిరిగి ఆఫీసులకు వెళ్లి పనిచేయడానికి ఇష్టపడటంలేదు. ఈ విషయాన్ని గుర్తించిన కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని ప్రవేశపెట్టి ప్రస్తుతం అమలు చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ పని విధానంలో మరో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఇంట్లో లేకపోయినా, ఆఫీసుకు రాకపోయినా.. ఎక్కడ ఉన్నా పనిచేసేలా వర్క్ ఫ్రమ్ కార్ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నది. మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ ఆటో సాప్ట్వేర్తో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ను అనుసంధానం చేస్తూ రిమోట్ వర్క్ (ఎక్కడినుంచైనా) పనిచేసే విధానానికి కొత్త భవిష్యత్తును చూపిస్తున్నది. మైక్రోసాఫ్ట్కు టీమ్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అత్యంత కీలకంగా ఉన్నది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు టీమ్స్ ద్వారానే ఎక్కువగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో ఆపరేటింగ్ సిస్ట మ్స్ ఉన్నట్టుగానే కార్లల్లోనూ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే పేర్లతో ఆపరేటింగ్ సిస్ట మ్స్ ఉన్నాయి. వీటి వినియోగం కార్లలో విసృత్తంగా పెరిగింది. ఇన్ఫోటైన్మెంట్ పేరుతో అం దిస్తున్న ఈ సేవలకు రోజురోజుకు సరికొత్త సేవలను కార్ల కంపెనీలు జతచేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ను కార్లోని ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లే యాప్కు అనుసంధా నం చేస్తూ ఫోన్ నుంచి చేసే పలు కార్యకలాపాలను కారు నుంచి సులభంగా చేస్తున్నారు. దీనికి మరింత ప్రాధాన్యతనిస్తూ మైక్రోసాఫ్ట్ సంస్థ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చిన టీమ్స్ యాప్ను కార్లలోని ఆపరేటింగ్ సిస్టంతో అనుసంధానం చేస్తున్నది. దీంతో ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ టీమ్స్ ద్వారా ఆఫీసు పనులను చేసే ఉద్యోగులు ఇక నుంచి కారులోంచే పనిచేసేలా సౌలభ్యాన్ని పరిచేయం చేస్తున్నది.
దాదాపు సగం మంది కార్ల కొనుగోలుదారులు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లేని వాహనాన్ని కొనుగోలుకు విముఖత చూపుతున్నారని ఇటీవల మెకిన్సే సర్వే వెల్లడించింది. ఆండ్రాయిడ్ ఆటో యాప్ ను రోడ్లపై 200 మిలియన్ కార్లలో ఉపయోగిస్తున్నట్టు గూగుల్ పేర్కొన్నది. అందుకే ఈ కొత్త పనివిధానాన్ని వర్క్ ఫ్రమ్ కార్గా పే ర్కొంటున్నారు. త్వరలోనే దీన్ని విసృత్తంగా వాడుకలోకి తెచ్చేందుకు కార్ల కంపెనీల తయారీదారులు, ఐటీ కంపెనీల నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.