మహబూబాబాద్ రూరల్, జూలై 17: అతనో చిరువ్యాపారి. కూరగాయలు విక్రయిస్తేనే పూట గడిచేది. ఓ వైపు వృద్ధాప్యంలోనూ కష్టాలు తప్పడం లేదు.. మరోవైపు రోజురోజుకూ కడుపులో పెరుగుతున్న కణతి కన్నీళ్లు తెప్పిస్తున్నది. దాన్ని తొలగించుకొనేందుకు అప్పుగా తెచ్చుకున్న సుమా రు రూ.రెండు లక్షలను ఎలుకలు తుక్కుతుక్కుగా కొట్టివేసి అతడికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాకు చెందిన భూక్యా రెడ్యా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూరగాయలు విక్రయిస్తుంటాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పరీక్షలు చేయించుకోగా కడుపులో కణతి ఉందని, ఆపరేషన్కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. సొంతంగా పోగుచేసుకున్న రూ.20 వేలతోపాటు ఇటీవల అప్పుగా తెచ్చిన రూ.1.80 లక్షలను ఓ సంచిలో పెట్టి బీరువాలో దాచుకున్నాడు. బీరువాకు ఒక వైపు రంధ్రం పడి ఉండటాన్ని గమనించలేదు. అందులో నుంచి వచ్చిన ఎలుకలు బ్యాగుతో సహా కరెన్సీ నోట్లను చిత్తుచిత్తుగా కొరికేశాయి. శనివారం బీరువా తెరిచిన రెడ్యా ఆ డబ్బులను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వాటిని ఏ బ్యాంకుకు తీసుకెళ్లినా చెల్లవని చెప్తున్నారని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని కోరుతున్నాడు.