వరంగల్ చౌరస్తా, ఆగస్టు 2 : ట్రాన్స్జెండర్లకు ఆధునిక వైద్యసేవలందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్లో ప్రత్యేక క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఎంజీఎంలోని ఓపీ విభాగంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రతి మంగళవారం వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన క్లినిక్ను మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్తో కలిసి కలెక్టర్ గోపి ప్రారంభించారు. ఇందులో డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ఎస్టీడీ, హెచ్ఐవీ విభాగాధిపతుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హార్మోన్ల అసమతుల్యత కారణంగా శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మొదటి దశలోనే గుర్తిం చి వైద్యసేవలను అందిస్తే ఫలితం ఉంటుందన్నారు. క్లీనిక్లో వైద్యసేవలు పొందేవారికి ఉచిత ల్యాబ్ సౌకర్యం, మందులు అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న సుమారు 60 వేల మంది ట్రాన్స్జెండర్లకు ఈ సేవల వివరాలను అందుబాటులో ఉంచేందుకు హెల్ప్లైన్ నంబర్ 99631 64111ను సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు. తమిళనాడులో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అందిస్తున్న సేవలను ఎంజీఎం నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. సాధారణంగా అన్ని విభాగాలతోపాటు ఈ విభాగానికి సైతం అవసరమయ్యే అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.