మెట్పల్లి: అప్పు తీసుకుని పారిపోయిన ఓ వ్యక్తి తండ్రి పట్ల అప్పులోళ్లు అమానవీయంగా వ్యవహరించారు. తమ డబ్బు రాబట్టుకోవడం కోసం మరణించిన ఆ వృద్ధుడిని అవమానించారు. కొడుకు చేసిన తప్పుకు అతని చనిపోయిన తండ్రి గౌరవానికి భంగం కలిగించారు. దహన సంస్కారాలు నిర్వహించకుండా అడ్డుతగిలారు. చివరకు తన ఆస్తులు అమ్మి అప్పు చెల్లిస్తానని కొడుకు హామీ ఇవ్వడంతో అప్పులోళ్లు అడ్డు తొలిగారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చైతన్య నగర్ ప్రాంతానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్ గత కొంత కాలంగా పలువురి వద్ద రూ.1.70 కోట్ల అప్పు చేశాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక పోవడంతో అప్పులోళ్లు ఒత్తిడి చేశారు. దాంతో తట్టుకోలేక శ్రీకాంత్ హైదరాబాద్కు పారిపోయాడు. ఈ క్రమంలో శనివారం శ్రీకాంత్ తండ్రి పుల్లూరి నారాయణ మృతి చెందాడు. దాంతో తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఆదివారం చైతన్యనగర్కు వచ్చాడు. ఇదే అదనుగా అప్పులోళ్లు శ్రీకాంత్ను అడ్డుకున్నారు.
తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పు తిరిగి చెల్లించే వరకు దహన సంస్కారాలు జరగనిచ్చేది లేదని అడ్డుతగిలారు. చివరకు తన ఆస్తులు అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు అడ్డు తొలిగారు. ఆ తర్వాత పుల్లూరు నారాయణ దహన సంస్కారాలను పూర్తిచేశారు.