హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై చలి పంజా విసురుతున్నది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో పది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువ ఉన్నది. రాబోయే 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్యం దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. చలికితోడు పొగ మంచు భారీగా కురుస్తున్నది. ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతున్నది. ఆదివారం సంగారెడ్డిని మంచు దుప్పటి కమ్మేసింది. నాందేడ్-అఖోల నేషనల్ హైవే 161ని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 10 దాటినా రోడ్డుపై పొగమంచు దట్టంగా కమ్ముకున్నది. హైవేపై కనుచూపు మేరలో వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొందరు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణాలను కొనసాగించారు.