హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగా పేర్కొంటున్న ‘మెటావర్స్’ ఆరోగ్య సంరక్షణలోనూ కీలకపాత్ర పోషించనున్నదని నిపుణులు తెలిపారు. ఆ దిశగా దీనిపై పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. హెచ్ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా బయో ఏషియో సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘ఆరోగ్య సంరక్షణలో అత్యాధునిక సాంకేతికతలు’ అనే అంశంపై ప్రముఖులతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవై డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ పార్టనర్ రామ్దేశ్ పాండే సంధానకర్తగా వ్యవహరించిన ఈ చర్చలో జీఎస్కే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అగమ్ ఉపాధ్యాయ్, ఐమెటా కంపెనీ హెడ్ ఆఫ్ జీటీఎం అండ్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రతినిధి ఫిలిప్స్ హౌబెన్ ‘మెటావర్స్’పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఇవీ..
కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి
ప్రస్తుతం ప్రతి రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. వైద్యారోగ్య రంగంలో కొత్తగా వస్తున్న టెక్నాలజీలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరమైన చోట వీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు. పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్కు నూతన టెక్నాలజీలను విరివిగా ఉపయోగిస్తున్నారు. వైద్య చికిత్సల్లో ‘మెటావర్స్’ విప్లవాత్మకమైనదిగా మారనున్నది. ఇప్పటికే వైద్యవిద్య, శిక్షణ విభాగాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు.
– రామ్దేశ్ పాండే, పార్టనర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈవై
వైద్య రంగానికి కీలకం
కొత్త టెక్నాలజీల్లో ఒకటైన ‘మెటావర్స్’ క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే గేమింగ్, వర్చువల్ మీటింగ్స్, విద్యాబోధన, శిక్షణకు ఉపయోగిస్తున్న ఈ సాంకేతికతకు వైద్య రంగంలో ప్రాధాన్యం పెరగనున్నది. ఈ టెక్నాలజీ సాయంతో డిజిటల్ రూపంలోనే యంత్రాలను రూపొందించి వైద్య రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సిమ్యులేషన్ ద్వారా శిక్షణ ఇవ్వవచ్చు. వివిధ రకాల పరిశోధనలు, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి కూడా ‘మెటావర్స్’ను ఉపయోగించుకోవచ్చు. – అగమ్ ఉపాధ్యాయ్,
– చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, జీఎస్కే, యూఎస్ఏ
వైద్యులతో వర్చువల్గా సంప్రదింపులు
వైద్య రంగంలో డిజిటల్ పరివర్తనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో వినియోగిస్తున్న వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీని వైద్య రంగంలోనూ వాడుతున్నారు. వైద్యులను రోగులు నేరుగా సంప్రదించాల్సిన పని లేకుండా వర్చువల్ రియాలిటీ ద్వారా సంప్రదింపులు జరిపేందుకు ‘మెటావర్స్’ టెక్నాలజీ ఉపకరిస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ పద్ధతి మొదలైంది. వివిధ రకాల పరిశోధనలు, నివేదికల రూపకల్పనతోపాటు ఔషధాల అభివృద్ధికి సైతం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
– ఫిలిప్స్ హౌబెన్, హెడ్ ఆఫ్ జీటీఎం అండ్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఐమెటా, బోహింగర్