CESS | హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యు త్తు పంపిణీ సంస్థ (సెస్)ను వెంటనే ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో సెస్ను విలీనం చేయాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంతర్గత ఆడిట్లో వెల్లడైన సమాచారం ప్రకారం 2014 నుంచి 2022 వరకు కోల్పోయిన ఆదాయం సుమారు రూ.94.88 కోట్లు ఉంటుందని ఈఆర్సీ తన నివేదికలో పేర్కొన్నది. ఈఆర్సీ స్వతంత్రంగా సెస్ కార్యకలాపాలు, లావాదేవీలపై ఆడిట్ నిర్వహించింది. విద్యుత్తు సంస్థల ఆడిటింగ్లో అనుభవం, నైపుణ్యం ఉన్న నాగభైరవ అండ్ అసోసియేట్స్తో ఆడిటింగ్ చేయించింది. సెస్ పరిపాలనా కార్యాలయం, వేములవాడ, తంగళ్లపల్లి, గంభీర్రావుపేటల్లోని ఈఆర్వో కార్యాలయాల పరిధిలో 2019-20 నుంచి 2021-22 వరకు ఆడిట్ నిర్వహించారు. సెస్ స్టోర్కు సంబంధించి 2020 ఏప్రిల్కు ముందు రికార్డులు లేవని తేలినట్టు నివేదికలో పేర్కొన్నారు.
రూ. 94.88 కోట్ల ఆదాయం కోల్పోయిన సెస్
2014 నుంచి 2022 వరకు మొత్తం రూ.94.88 కోట్లకుపైగా ఆదాయాన్ని సెస్ కోల్పోయినట్టు ఆడిట్లో గుర్తించారు. ఇందులో ప్రధానంగా క్యాటగిరీ 2 కింద బిల్లింగ్ చేయాల్సిన వినియోగదారులకు క్యాటగిరీ 3 కింద బిల్లింగ్ చేయడం వల్ల 3.41 కోట్లు, విద్యుత్తు కనెక్షన్లను కలిపివేయడం వల్ల 22.16 కోట్లు, హైటెన్షన్ కనెక్షన్లలో టెన్షన్ (ఎల్టీ) కింద బిల్లులు చేయడం వల్ల 23.77 కోట్లు, క్యాటగిరీ 6లోని కనెక్షన్లను జీరో రీడింగ్గా చూపడం వల్ల 3.12 కోట్లు, మీటర్లు స్ట్రక్అప్ అయిన కేసుల్లో18.83 కోట్లు, పవర్లూమ్స్ కోర్టు కేసుల వల్ల 18.84 కోట్లు.. ఇలా మొత్తం 94,88,71,851 ఆదాయాన్ని నష్టపోయినట్టు గుర్తించారు. సెస్ స్టోర్ను ఇన్సూరెన్స్ చేయక 2018-19లో వచ్చిన వరదలతో తీవ్ర నష్టం వాటిల్లినట్టు తేల్చారు.