హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): వందేళ్ల విద్యా వటవృక్షమైన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు చేయూతనిస్తున్నారు. విరివిగా విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా ఓయూ కెమిస్ట్రీ విభాగం పూర్వ విద్యార్థి డాక్టర్ సుధాకర్ విడియాల లక్ష యూఎస్ డాలర్లను (రూ.74.72 లక్షలు) విరాళంగా ఇచ్చారు. ఓయూలో చదువుకొని విదేశాల్లో ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడ్డ ఆయన.. తన ఉన్నతికి తోడ్పాటునందించిన కెమిస్ట్రీ విభాగంలో మౌలిక వసతుల కల్పన, విద్యాప్రమాణాల పెంపు కోసం ఈ విరాళం ఇచ్చారు. డాక్టర్ సుధాకర్ లక్ష డాలర్లను విరాళంగా ఇవ్వడం హర్షణీయమని, గతంలో హెటిరో డ్రగ్స్, ఎంఎస్ఎన్ ల్యాబ్ సంస్థలు సైతం ల్యాబ్ల అభివృద్ధికి తోడ్పాటునందించినట్టు కెమిస్ట్రీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ ఉమేశ్ తెలిపారు. డాక్టర్ సుధాకర్ వారం రోజుల్లో హైదరాబాద్కు విచ్చేసి, ఓయూను సందర్శించనున్నట్టు పేర్కొన్నారు.
పూర్వవిద్యార్థులతో మెంటారింగ్ సెషన్స్
పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయడంలో భాగంగా ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్ (ఓయూసీఎఫ్)ను రిజిస్ట్రేషన్ చేయించి, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెంటరింగ్ కోసం ప్రత్యేక గ్రూపు ఏ ర్పాటుచేసి ప్రతీ వారం స్కాలర్లు, విద్యార్థులకు మెంటారింగ్ సెషన్స్ జరుపుతున్నారు. పూర్వవిద్యార్థులు, ఫ్యాకల్టీ ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఎన్నారైలను భాగస్వా మ్యం చేసేందుకు కెమిస్ట్రీ విభాగం ఫ్యాకల్టీ చొరవ తీసుకుంటున్నారు.