హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీడ్ కార్పొరేషన్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. విత్తన రంగంలో వెనుకంజలో ఉన్న నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ) బలోపేతానికి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ విధానాలను అమలు చేయనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 9 మంది అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను సందర్శించి, ఇక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అమలు చేస్తున్న విధానాలను సంస్థ ఎండీ కేశవులు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.
దీంతో తెలంగాణ విత్తనరంగం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కేంద్ర కమిటీ ప్రశంసించింది. ఈ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని అభిప్రాయపడింది. కేంద్ర కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్కే రావు, సభ్యుడు వీ శంకరన్ మాట్లాడుతూ.. తెలంగాణలో నూతన సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా విత్తనోత్పత్తిని పర్యవేక్షించడం, విత్తన ధ్రువీకరణ సేవలు అందించడం, సీడ్ లైసెన్సులు జారీచేయడం అద్భుతంగా ఉన్నదన్నారు. ఈ విధానాలే తెలంగాణను విత్తనరంగంలో మేటిగా నిలిపాయని చెప్పారు.