ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ శతాబ్ది సదస్సులో మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం, స్పీకర్ పోచారం
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చట్టసభల గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. చట్టసభలను గౌరవిస్తూ వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. 1921, సెప్టెంబర్ 15న సిమ్లాలో ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి వందేండ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లా బుధవారం వర్చువల్గా సదస్సు నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వెన్నవరం, పోచారం ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పార్లమెంట్, రాష్ట్ర స్థాయిలో లెజిస్లేచర్ సభలు సమర్థంగా పనిచేస్తున్నాయన్నారు. సభ్యులు సహకరిస్తేనే చట్టసభలు సజావుగా ముందుకు సాగుతాయని, విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకోకుండా ప్రజలకు అర్థమయ్యేలా ప్రభుత్వానికి సలహాలు, సూచలు ఇవ్వాలని సూచించారు. సదస్సులో రాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు కూడా పాల్గొన్నారు.