మహబూబ్ నగర్: తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యాటక రంగాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ పర్యాటకాన్ని ప్రజలకు చేరువ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు మహబూబ్ నగర్ నుంచే పర్యాటక సర్క్యూట్ బస్సును ప్రారంభించామని ఆయన వెల్లడించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా జిల్లాలో పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏసీ పర్యాటక బస్సును ఆయన ప్రారంభించారు.
ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా ముస్తాబు చేసిన పర్యాటక శాఖ వారి ఏసీ బస్సును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి యు. వెంకటేశ్వర్లు తదితరులు ఈ పర్యాటక బస్సులో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, ఆసియాలోనే రెండో అతి పెద్ద పిల్లలమర్రి, పేదల తిరుపతిగా ఖ్యాతి గాంచిన మన్యంకొండను ఓ పర్యాటక సర్క్యూట్గా మార్చి బస్సు సౌకర్యం కల్పించామని వివరించారు. పెద్దలకు కేవలం రూ.300, పిల్లలకు రూ.200కే ఈ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇందులోనే మధ్యాహ్న భోజనం, స్నాక్స్, టీ ఇస్తారని తెలిపారు. అతి తక్కువ ధరలో ఏసీ బస్సులో 3 ప్రఖ్యాత ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించామన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లా పర్యాటక సర్క్యూట్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, కోయిల్ సాగర్, సోమశిల, నల్లమల పర్యాటక సర్క్యూట్ ద్వారా ఉమ్మడి జిల్లా సందర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక టూరిజం సర్క్యూట్లలో బస్సు సౌకర్యం ద్వారా పర్యటించే అవకాశం కల్పించాలని టూరిజం అధికారులను మంత్రి ఆదేశించారు.