హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను ముందే గుర్తించి మెరుగైన చికిత్సతో మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో స్టార్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాన్సర్ సెంటర్ను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేని అత్యాధునిక పరికరాలు, ఆధునిక రోగనిర్ధారణ విధానాలతో కూడిన క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని స్టార్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిందని కొనియాడారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో కలిసి తెలంగాణ, ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని చిరంజీవి విజ్ఞప్తి చేయడంతో.. ఆ దిశగా చర్యలు చేపడతామని స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మన్నం గోపీచంద్ హామీ ఇచ్చారు. అనంతరం క్యాన్సర్తో వీరోచితంగా పోరాడి విజయం సాధించిన పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడపాటి రమేశ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.