హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8,9న ‘మెగా మహిళా రైతు మేళా’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడలో సెర్ప్ డైరెక్టర్ కే సునీత, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి డాక్టర్ టీ సుధాకర్రెడ్డితో కలిసి మహిళా మేళా వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న మెగా మహిళా రైతు మేళాను ఆదివారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సుమారు 10వేల మంది మహిళా రైతులు సమావేశమవుతారని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఆవిషరణలకు సంబంధించి దాదాపు 80 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.